మంత్రి పదవి వస్తుందని ఆశపడి అవంతి శ్రీనివాస్ పార్టీమారారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మంత్రి కావాలనే ఆశలో వైసీపీలో చేరిన అవంతి కలలు… కల్లలు అవుతాయన్నారు. ఊసరవెల్లిలా పార్టీలు మార్చే అవంతి శ్రీనివాస్కు టీడీపీని విమర్శించే అర్హత లేదని బోండా ఉమ అన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఉమ ధీమా వ్యక్తం చేశారు.
గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి లేకపోతే.. అవంతి శ్రీనివాస్ అనే అతను ఎక్కడ ఉండేవాడో తెలుసుకోవాలన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి తనకు దేవుడితో సమానం అని మాట్లాడిన అవంతి.. ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బోండా ఉమ అన్నారు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన ఆయన ఇవాళ జగన్ ఉచ్చులో ఇరుక్కున్నారని విమర్శించారు.