అందం గురించి గుచ్చిగుచ్చి తనను అన్న మాటలకూ ఆమె కుంగిపోలేదు. తనను తాను మార్చుకునేందుకు సిద్దపడింది. కష్టపడింది. ఇదే ఇప్పుడు ఆమెకు ‘మిస్ టీన్ వరల్డ్-2019 కిరీటాన్ని తెచ్చిపెట్టింది. ఈ టైటిల్ను అందుకున్న మొదటి ఆసియా అమ్మాయిగా గుర్తింపు సాధించింది. ఆమే ముంబయి కల్యాణ్కి చెందిన పద్దెనిమిదేళ్ల సుశ్మితాసింగ్. అమెరికాలో జరిగిన ఈ మిస్టీన్ వరల్డ్ వేడుకలో ఎంతోమందితో పోటీపడి మరీ సుశ్మిత ఈ గుర్తింపు సాధించింది. ఎనిమిది రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో పోటీదారులు పబ్లిక్ పరేడ్, మేయర్ విజట్, సైట్-సీయింగ్, పొటోషూట్, స్పాన్సర్ యాక్టివిటీస్, సామాజిక సేవ.ఇలా ఎన్నింటిలోనో పాల్గొన్నారు. వీటికితోడు ప్రవర్తన, ప్రతిభ, ఫిట్నెస్, ఫ్యాషన్, అందం..వంటి అంశాల్ని కూడా న్యాయనిర్ణేతలు గమనించి తీర్పు చెప్పారు.
సుశ్మిత మాస్ మీడియా విద్యార్థిని. ఆమెకు చిన్నతనం నుంచి చిత్రలేఖనం, క్రీడలు, ఉపన్యాసాల పట్ల చాలా ఆసక్తి. నేను స్కూల్లో ఉన్నప్పుడు క్రీడల్లో పాల్గొనేదాని. చాలా పతకాలు కూడా వచ్చాయి. ఓసారి మా స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా నాకు కూడా ర్యాంప్ మీద నడవాలని అనిపించింది. ఆ సమయంలో కొందరు టీచర్లు, సీనియర్లు నేను అబ్బాయిలా నడుస్తానని, అందంగా లేనని అన్నారు. చాలా బాధేసింది. అయితే అప్పటి నుంచి నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నించా. నాలుగేళ్ల తరువాత ఈ పోటీ గురించి తెలిసింది. దానికోసం మరింత కష్టపడ్డా. అదే గుర్తింపు తెచ్చింది. కలలు నెరవేర్చుకోవాలనుకునే అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా అని చెబుతోంది సుశ్మితాసింగ్.