నిన్న జరిగిన ఏపీ శాసనమండలి సమావేశాలు ఉద్రిక్తతల మధ్య సాగాయి. టీడీపీ సభ్యులు తమపై దాడి చేశారంటూ వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాకు వివరాలు తెలిపారు. టీడీపీ సభ్యుడు నారా లోకేశ్ సభలో నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీశాడని అన్నారు. ఎవరు చెప్పినా లోకేశ్ వినిపించుకోలేదని తెలిపారు. శాసనమండలి చైర్మన్ కూడా చెప్పారని, అయినప్పటికీ లోకేశ్ ఫొటోలు తీశారని వెల్లడించారు. దాంతో తాను జోక్యం చేసుకుని ఫొటోలు తీయొద్దంటూ లోకేశ్ కు చెప్పానని వివరించారు.
టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, దీపక్ రెడ్డి తనపై దాడి చేశారని, అందుకు లోకేశ్ ప్రోత్సాహం ఉందని వెల్లంపల్లి తెలిపారు. తనపైనే కాకుండా ఇతర మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబులపైనా దాడి జరిగిందని వివరించారు. లోకేశ్ తీరు చూస్తుంటే సిగ్గేస్తోందని అన్నారు. అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చర్చించని టీడీపీ, మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని వెల్లంపల్లి ఆరోపించారు.