జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ అధికారం లేకుండా ఉండలేడని, గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తోకలా వ్యవహరించారని అన్నారు. ఎలాగైనా మోదీతో జట్టు కట్టేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అందుకే సీఎం జగన్ పై ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నాడని వెల్లంపల్లి అన్నారు.
2009 ఎన్నికల్లో చిరంజీవికి అధికారం దక్కకపోయేసరికి ఆయన నుంచి దూరంగా వచ్చేశాడని ఆరోపించారు. జగన్ ను విమర్శిస్తే ప్రజలు మద్దతు పలుకుతారనే భ్రమలో పవన్ కల్యాణ్ ఉన్నాడని అన్నారు. ఇసుక అంశంలో పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఓవైపు నదులు పొంగిపొర్లుతుంటే ఇసుక ఎలా తవ్వుతారని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు.