లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులు ఒత్తిడి తీసుకురావడంపై ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఊరట లభించింది. అమీర్పేట, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి పరిధిలో ఉన్న ప్రయివేటు హాస్టల్స్ నిర్వాహకులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై హాస్టల్స్ నిర్వాహకులతో మంత్రి చర్చించారు. హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులను ఖాళీ చేయించొద్దని మంత్రి ఆదేశించారు.
హాస్టళ్లకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్స్ నిర్వాహకులకు చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. హాస్టల్స్ నిర్వాహకులు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు.