telugu navyamedia
తెలంగాణ వార్తలు

న‌మో అంటే న‌రేంద్ర‌మోదీ కాదు..న‌మ్మించి మోసం చేసే వాడు..

*ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పై కేటీఆర్ ఫైర్‌..
*మోదీ తెలంగాణకు ప్ర‌ధాని కాదా?
*బండి సంజ‌య్ తెలంగాణ‌కు ఎంపీగా ఉండి ఒక్క పైసా తెచ్చాడా..?
*బీజేపీ నేత‌లు హ‌ద్దులు దాటితే చుక్క‌లు చూపిస్తాం..

*బీజేపీ అంటే బక్వాస్ పార్టీ ..
*బీజీపీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ

తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించే మోడీని ప్రజలు క్షమించరని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీకి, మోదీకి తెలంగాణలో స్థానం ఉండలా వద్దా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసైందన్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు.

మోదీ ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వమని చెప్పారు. తెలంగాణపై మోదీ విషం కక్కుతున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసిన మోదీని తెలంగాణ సమాజం క్షమించదని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీని బట్టలిప్పి నగ్నంగా కొడదామని మంత్రి కేటీఆర్ అన్నారు.

బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతుందని.. మూడేళ్ల కాలంలో మూడు పైసలు కూడా తేలేదన్నారు.బీజేపీ అంటే బక్వాస్ పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

పాల‌మూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరని.. అదే క‌ర్ణాట‌క‌లోని అప్పర్ భ‌ద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారన్నారు. కానీ మ‌నం అరిచినా, గీ పెట్టినా కూడా మ‌న‌కు జాతీయ హోదా ఇవ్వరని కేటీఆర్ ఆరోపించారు.

మోదీ కేవ‌లం యూపీకే ప్రధాన మంత్రా? తెలంగాణ ప్రజ‌ల మీద ఎందుకింత వివ‌క్ష అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన గత 8 ఏళ్లలో తెలంగాణకు ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మన నాయకుడిపై మాట్లాడితే బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి, బండి సంజాయ్‌ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, వారికి వ్యక్తిగతంగానే సమాధానం చెప్పాలని కేటీఆర్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు బంటు అని ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ ఎవరి బంటో తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇద్దరికీ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని కేటీఆర్ అన్నారు.

Related posts