ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మోనార్క్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐ లాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, ప్రతిపక్షనేత జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు.
ప్రత్యేక హోదాపై జగన్ ఏనాడైనా మోదీని నిలదీశారా? అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ మోదీపై ఒక్క విమర్శ చేయలేదన్నారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు జగన్ మోదీని వెనకేసుకు వస్తున్నట్లు తెలిపారు. జగన్ కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మొన్న కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తి సినిమా చూపిస్తామని లోకేష్ హెచ్చరించారు.