telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి సంజయ్ చేస్తున్నది ప్రజా వంచన యాత్ర – మంత్రి కేటీఆర్ లేఖ

కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభమని మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడతగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై తీవ్రంగా స్పందిస్తూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

బండి సంజయ్ చేస్తున్నది ప్రజా వంచన యాత్ర అని అభివర్ణించారు. ఓ జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న ధగాకోరు యాత్ర అంటూ లేఖలో పేర్కొన్నారు. పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు అక్కడ అడుగుపెట్టే హక్కులేద‌ని మంత్రి అన్నారు.

కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జల దోపిడీకి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా? పాలమూరుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులపై బోర్డులు పెట్టి బోడిపెత్తనం చేస్తూ పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? పాలమూరుపై కక్ష ఎందుకో సమాధానం చెప్పాలి.

విభజన హామీలు నెరవేర్చే తెలివి లేదు, నీతి ఆయోగ్ చెప్పినా నిధులిచ్చే నీతి లేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు. ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్లు పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు.

తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజీపీ అని అన్నారు. రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతకాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరతారా?… కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం? పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని  అంటూ మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

Related posts