*కేసీఆర్కు ఇంకా కొన్ని రోజులే టైముంది..
*మూసీ ప్రభావిత ప్రంతాలల్లో కేంద్రమంత్రి పర్యటన
*వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. తెలంగాణను వదిలి ఢిల్లీలో ఏం చేస్తున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఉదయం ముసారంబాగ్ వద్ద మూసి వరదను పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్లో ఉండిపోయారని మండిపడ్డారు.
వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చోవటం విచారకరమన్నారు. సీఎం కేసీఆర్ నాలుగు రోజులు ఢిల్లీలో ఏమి చేశారో ప్రజలకు తెలియాలని అన్నారు.
కొడుకు మీద వాత్సల్యంతో కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేయటం తగదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలాయని… ప్రజలు ఇంకోసారి టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వరని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఎస్డీఆర్ఎఫ్ నిధులపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా మూసీని ఆక్రమిస్తున్నందునే ఏటా పేదల ఇళ్లు నీట మునుగుతున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు.
మూసీ ఒడ్డున అక్రమంగా షెడ్డులు వేసి పేదలకు అద్దెకు ఇస్తున్నవారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళలన చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రం కోరుతున్న ఎస్డీఆర్ఎఫ్ నిధులకు ఆడిట్ లేదని విమర్శించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులపై కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.