ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వాయుగుండం వల్ల రాష్ట్రం లో భారీ వర్షాలు పడ్డాయని తెలిపారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో పంట నష్టం జరిగింది..పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోందని…ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వమని హామీ ఇచ్చారు మంత్రి కన్నబాబు.
ఈ ఏడాది అనంతపురంలో సైతం అధిక వర్ష పాతం నమోదయిందని వెల్లడించారు. వేరుశనగ పంటకు నష్టం జరిగిందని.. నిపుణులు కమిటీని అనంతపురంకు పంపుతున్నామని పేర్కొన్నారు మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోతక్కువ వర్షపాతాలు నమోదయ్యాయని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు మంత్రి కన్నబాబు.