కుప్పంలోనే కుదేలైన చంద్రబాబు ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు.
శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధానికి సిద్ధం కండి.. జైలుకు వెళ్లండి.. కేసులు పెట్టించుకోండి.. కోర్టులో నేను చూసుకుంటాను అంటూ టీడీపీ శ్రేణులకు చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు జైలుకు వెళ్లాలి.. బాబు, ఆయన కొడుకు మాత్రం ఇంట్లో కూర్చుంటారని ఎద్దేవా చేశారు
కుప్పంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయి వచ్చాడని రమేష్ విమర్శించారు. కొట్లాడడానికి.. పోరాడడానికి చంద్రబాబుకేమో వయసైపోయిందని.. కొడుకేమో పనికిరాని చవట.. పప్పు.. తుప్పు అంటూ తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీని, చంద్రబాబును మోకులు, జాకీలు, జేసీబీలు, బుల్డోజర్లు పెట్టి లేపినా ప్రయోజనం శూన్యమని తేల్చిచెప్పేశారు. తల్లకిందులుగా తపస్సు చేసినా వైఎస్ జగన్ను, వైసీపీని కనీసం టచ్ కూడా చేయలేరని ఆయన అన్నారు.
ముందు కుప్పంలో నీ గతి ఏమవుతుందో చూసుకో. పులివెందులను టచ్ చేసే దమ్ము, ధైర్యం ఉందా? పైపెచ్చు మేకపోతు గాంభీర్యం మాటలు. ఎక్కడ నుంచి పోటీ చేసినా చంద్రబాబు నాయుడు పని ఔట్ అంటూ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి పొందిన వ్యక్తి పండుగ చేసుకోవటం సిగ్గు చేటని… సెప్టెంబర్ 2 అంటే తెలుగు ప్రజలంతా వైఎస్ఆర్ ని గుర్తు చేసుకుంటారని జోగి రమేశ్ పేర్కొన్నారు.
అలాంటి రోజున పార్టీ సమావేశం పెట్టి జగన్ని తిట్టడం మొదలు పెట్టారని.. రెండు లక్షల కోట్లు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్నారని.. వీటిపై చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడకు రావాలో చెప్తే అక్కడకే తామే వస్తామని స్పష్టం చేశారు.సుమారు లక్షా 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందజేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యకలాపాలను జగన్ దెబ్బతీశారు: యనమల