ఏపీ రాజధాని అమరావతి పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బొత్స స్పందిస్తూ రాజధాని అమరావతిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు. రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు.
రాజధాని విషయంలో తాను మాట్లాడింది వరదల గురించేనని తెలిపారు. పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే అతలాకుతలమైందని అన్నారు. మొన్న 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని వెల్లడించారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ రిపోర్టు కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారని బొత్స ఆరోపించారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడుతున్నట్టే ఉందని విమర్శించారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టే భయపడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే తాము కాంక్షిస్తామని పేర్కొన్నారు.