స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికుల ఆశలపై కర్నాటక ప్రభుత్వం నీళ్లు చల్లింది. వలస కార్మికుల కోసం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. కర్ణాటక నుంచి ప్రత్యేక రైళ్లు ఉండబోవని స్పష్టం చేసింది. అయితే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై స్పష్టత లేకపోయినప్పటికీ సిటీ బిల్డర్స్ సీఎంను కలిశాకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తోంది.
ఐదు రోజుల పాటు రోజుకు రెండు రైళ్లు చొప్పున నడపాలని రైల్వే శాఖను తొలుత కర్ణాటక ప్రభుత్వం కోరింది. అయితే.. 6వ తేదీ నుంచి ప్రత్యేక రైలు సర్వీసులు అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మంజునాథ ప్రసాద్ నైరుతి రైల్వే జనరల్ మేనేజర్కు లేఖ పంపారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా వలస కూలీలు ఎక్కడికి వెళ్లొద్దని వారికి పని కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.