ఏపీలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్లోనే ఆగిపోయింది. రైలు ఆగగానే (ఎస్5, ఎస్ 7) బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
చాలా మంది మహిళలలు మెడలో నుంచి బంగారాన్ని అపహరించినట్లు తెలుస్తోంది. ఎంత మొత్తం దోపిడీ జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 9 తులాల బంగారం, నగలు దుండగులు దోచుకున్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి 1:30 ఈ సంఘటన జరగడం జిల్లాలో కలకలం రేపింది.
దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలించారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ సెవెన్ హిల్స్ రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపారు.