మెర్సిడెస్ బెంజ్, విలాసవంతమైన కార్లతయారీ సంస్థ మరో రెండు కొత్త వెర్షన్ లు ఏ45 4మాటిక్+, ఏ45 ఎస్ 4మాటిక్+ ల వివరాలను బహిర్గతం చేసింది. ఈ రెండు కార్లలో నాలుగు సిలిండర్ల ఇంజిన్లు అమర్చారు. ఏ45 మోడల్ 480 ఎన్ఎం టార్క్ వద్ద 382 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ఏ45 ఎస్ మోడల్ 500 ఎన్ఎం టార్క్ వద్ద 415 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న గుడ్వుడ్ ఫెస్టివల్లో దీనిని విడుదల చేశారు. దీనికి స్లిమ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్లను అమర్చారు. ఈ కారులో అత్యంత శక్తివంతమైన 2.0లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ను అమర్చారు. దీనికి 8స్పీడ్ ఏఎంజీ స్పీడ్షిఫ్ట్ గేర్ బాక్స్ను అమర్చారు.
ఏ 45 మోడల్ నాలుగు క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటే.. ఏ45 ఎస్ మోడల్ 3.9క్షణాల్లో ఈ వేగాన్ని చేరుతుంది. ఈ కార్లు గంటకు 250 , 270 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. దీనిలో డ్రిఫ్ట్ మోడ్ కూడా ఉంది. ట్రాన్స్మిషన్ను మాన్యూవల్లోకి మార్చేసి.. ఈఎస్పీని ఆపివేస్తే కారు వెంటనే రేస్ మోడ్లోకి మారిపోతుంది. ఈ కారులో మొత్తం ఆరు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. స్లిపరీ, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, ఇండివీడ్యూవల్, రేస్ మోడ్లను ఇచ్చారు. కారు ఇంటీరియర్ సొగసు విషయంలో బెంజ్ ఏమాత్రం రాజీపడలేదు.