ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మహిళామణులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్లో పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను భార్య సురేఖతో కలిసి సత్కరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఒక కుటుంబంలో మహిళలలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చిన్నప్పుడు నుంచి అమ్మ పడే కష్టం ఏంటో నాకు తెలుసు. తన కష్టం చూశాను కాబట్టే మీ అందరి కోసం ఈ చిరు సత్కారం’ అని అన్నారు.
మీ అందరి కష్టం చూస్తుంటే మా అమ్మ గారి కష్టం గుర్తుకు వస్తుంది ..చిన్నతనంలో నాకోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. ఆమె కారణంగానే నేను మహిళా పక్షపాతిగా మారాను అని చెప్పాడు.
ఇక నేను సక్సెస్ఫుల్ హీరోగా నిలవడానికి సురేఖనే ప్రధాన కారణం. ఇంట్లో నా బాధ్యతలన్నీ తనే తీసుకుంది. దీంతో సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాను. ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఆమె చూసుకుంటుంది. నేను సినిమాలతో బిజీగా ఉంటే ఆమె ఇంట్లో నా తమ్ముళ్లను, పిల్లలను చూసుకునేది. నేను సినిమాలపై శ్రద్ధ పెడుతున్నానంటే తనే ప్రధాన కారణం. ’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి మగాడి విజయం వెనకాల ఒక మహిళ కచ్చితంగా ఉంటుందనడానికి సురేఖ మరో నిదర్శనం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను.
అలాగే..మహిళలు వంటింటికే పరిమితం కాకుండా.. అంతరిక్షంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతున్నారు. మహిళల సాధికారత కోసం అందరూ కృషి చేయాలి. ప్రతి ఇంట్లో అమ్మ, సోదరి సాధికారత కోసం అందరూ పాటుపడాలి. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి’ అని చిరంజీవి తెలిపారు.
చివరగా టికెట్ల జీవో అంశంపై రిపోర్టర్ చిరంజీవిని ప్రశ్నించగా.. సినిమా టికెట్ల జీవో గురించి ఇప్పుడు మాట్లాడనని, ఇది సందర్బం కాదు అన్నారు. దీని గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతాను అని ఆయన తెలిపారు.