telugu navyamedia
తెలంగాణ వార్తలు

‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్ట్‌ ప్రారంభం

టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలని చెప్పారు. వికారాబాద్‌లో డ్రోన్‌ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. డ్రోన్‌ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందన్నారు. గ్రహంబెల్‌ టెలిఫోన్‌, రైట్‌ బ్రదర్స్‌ విమానం లాగే డ్రోన్‌ టెక్నాలజీ ఓ సంచలనమని చెప్పారు. డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేస్తున్న యువతను అభినందించారు.ఇలాంటి సాంకేతికతను అందించడమే ప్రధాని మోడీ స్వప్నమని తెలిపారు. డ్రోన్‌ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. స్టార్టప్‌లను తేలిగ్గా చూడద్దని సూచించారు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోందని వెల్లడించారు. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. అన్నదాతలు, జ్ఞానదాతలు ముఖ్యమని చెప్పారు. ఏరోస్పేస్‌ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి గ్రీన్‌జోన్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు చారిత్రాత్మక దినమని అన్నారు. అధునాత టెక్నాలజీతో మందులను సరఫరా చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేయవచ్చని తెలిపారు. ఆరోగ్య రంగంలోనే కాదు, అనేక రంగాల్లో డ్రోన్‌ వాడొచ్చని అన్నారు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వాడుతున్నామని, అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్‌ చప్పుళ్లకే భయపడతారని చెప్పారు. మైనింగ్‌ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను డ్రోన్లతో కట్టడి చేయవచ్చన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్‌ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏవియేషన్‌ వర్సిటీగా మార్చాలని కేంద్ర మంత్రిని సింధియాను ఈ సందర్భంగా ఆయన కోరారు. వికారాబాద్‌ కొత్త కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు.

Related posts