మీడియా సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులకు వలవేసి చివరికి కటకటాల పాలయ్యాడు. తిరుపతి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన భానుప్రసాద్ అనే యువకుడు గతంలో కరీంనగర్లో ఓ జాబ్ కన్సల్టెన్సీ నడిపేవాడు. అందులో నష్టం రావడంతో తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం ఎస్టీ కాలనీకి మకాం మార్చాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల ఓ న్యూస్ ఛానల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. తనను సంప్రదించిన వారితో ఓ వాట్సప్ గ్రూప్ రూపొందించి ప్రాసెసింగ్ ఫీజుకింద ఒక్కొక్కరు 2000 రూపాయలు చెల్లించాలని, అలా చెల్లించినవారికి చానెల్ ఐడీ, లోగో ఇస్తామని నమ్మించాడు. తన భార్య పేరున ఉన్న బ్యాంకు అకౌంటులో డబ్బు జమచేయాలని సూచించాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ న్యూస్ ఛానల్ స్థానిక ఇన్చార్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రైమ్ పోలీసులు మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు.