తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావుకు రెండోసారి బెయిల్ మంజురైంది. నల్గొండ జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. తన కుమార్తె అమృత, తక్కువ కులానికి చెందిన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో, మారుతీరావు కిరాయి రౌడీలతో ప్రణయ్ ను దారుణంగా చంపించాడు.
ఈ కేసులో మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేయగా, గత నెలలో తొలిసారి బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆపై అమృత ఇంటికి తన మనుషులను పంపించిన మారుతీరావు, హత్య కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు.ఈ ఘటనపై అమృత మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మారుతీరావును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మారుతీరావు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో షరతులు విధించి బెయిల్ ను మంజూరు చేశారు.