కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలు లక్ష్మీ మంచు అమెరికన్ టీవీ సిరీస్ ‘లాస్ వేగాస్’తో యాక్టింగ్ కెరీర్ను ప్రారంభించారు. ఆ తరవాత కొన్ని ఇంగ్లీష్ టీవీ షోలలో నటించాక ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. టాలీవుడ్లో నటిగా, టీవీ హోస్ట్గా తనదైన ముద్ర వేశారు. ఓవైపు సినిమాలలో నటిస్తూనే, తెలుగు టీవీ షోలకు ప్రెజెంటర్గా వ్యవహరిస్తూ వచ్చారు లక్ష్మి. ఆమె హోస్ట్గా వ్యవహరించిన ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ చాట్ షోకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. లాక్డౌన్ పీరియడ్లో ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు’ పేరుతో పలువురు ఫేమస్ సినీ, పొలిటికల్ సెలబ్రిటీలతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే (అక్టోబర్ 8న) తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మి తన కొత్త షోను ప్రకటించారు. సౌత్ బే సమర్పిస్తోన్న ఆ షో పేరు ‘కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు’. ఆమె ఫిలిమ్స్, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్ తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో రాజమౌళి, తాప్సీ పన్ను, సెంథిల్ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాష్ రాజ్, శంతను, నిఖిల్, బిభు మొహాపాత్ర, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ తదితర ఫేమస్ పర్సన్స్ కనిపిస్తున్నారు. ‘కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు’ షో త్వరలోనే ప్రారంభం కానుంది.