హైదరాబాద్ లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్ (టిస్) యాజమాన్యానికి.. విద్యార్థులకు మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. మెస్సు బిల్లుల పెంపునకు నిరసనగా గత కొద్ది రోజులగా ఆ ప్రాంగణం విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సమస్యను పరిష్కరించక పోగా హైదరాబాద్ క్యాంపస్లో అకడమిక్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులంతా సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోగా క్యాంపస్ను ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేసింది.
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్(టిస్) లో బీఏ, ఎంఏ, ఎంఫిల్ కోర్సులను బోధిస్తున్నారు. ఆయా కోర్సుల్లో సుమారు ఐదు వందల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెస్ చార్జీలతో పాటు డిపాజిట్లను భారీగా యాజమాన్యం పెంచింది. వాటిని తగ్గించాలని, మెస్ కాంట్రాక్ట్కు సంబంధించిన టెండర్లను బహిర్గతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. విద్యార్థులు తమ ఆందోళనలతో ప్రాంగణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొంటూ ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది.