కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. బతుకుదెరువు లేక ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ సెక్యూరిటీ గార్డు కూడా కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉండగా అతడి జీవితంలో అద్భుతమే జరిగింది. లాటరీ తగిలి అతడికి రూ.31 కోట్లు దక్కాయి. ఆస్ట్రేలియా పెర్త్లోని అర్మడాలేలో నివసిస్తున్న ఆ వ్యక్తి కొన్నాళ్లు కిందట తన మూడేళ్ల కుమార్తెతో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ఓ షాప్ కి వెళ్లాడు. అక్కడ ‘ఓజ్ లొట్టో’ లాటరీ టికెట్లు కనిపించగా ఒకటి కొనుగోలు చేశాడు. కొన్నిరోజుల తర్వాత లాటరీ సంస్థ విజేతను ప్రకటించింది. అందులో ఆ వ్యక్తి పేరు ఉంది. విజేత తనే అని తెలుసుకోవడంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.లాటరీ అధికారులు ఈ డబ్బును ఏం చేస్తారు అని అడుగగా ‘ అమ్మకు కారు, తమ్ముడికి ఆర్థిక సాయం, ఇళ్లు కట్టుకొని, పిల్లలను మంచి స్కూళ్లలో చేర్పిస్తానని’ తెలిపాడు. కరోనాతో ఎందరో బికారులుగా మారిపోగా ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం కోట్లకు పడగలెత్తాడు. కరోనా కాలం అందరికీ ఓ చేదుగా మిగిలితే అతడికి మాత్రం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
previous post
దేశంలో ఒకే భాష ఉండాలి… అప్పుడే విదేశీ భాషలకు చోటుండదు: అమిత్ షా