పశ్చిమ బెంగాల్ పేరును “బంగ్లా”గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన ప్రతిపాదనను కేంద్రం నాలుగోసారి తిరస్కరించింది. రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చి ప్రజల కోరికను నెరవేర్చాలంటూ మమత రాసిన లేఖను మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. పశ్చిమ బెంగాల్ పేరును “బంగ్లా”గా మారుస్తూ 2018లో మమత ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అయితే, పేరు మార్పునకు అంగీకరించని కేంద్రం గతంలో మూడుసార్లు.1999, 2011, 2016లలో తిరస్కరించింది.
తాజాగా నాలుగోసారి కూడా పేరు మార్పుకు కేంద్రం నిరాకరించింది. ఈ మేరకు రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, 26 జూలై 2018లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రాష్ట్రం పేరును “బంగ్లా”గా మారుస్తూ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. ఆ తర్వాత దానిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపింది. అయితే, బంగ్లాదేశ్ పేరుతో ప్రతిపాదిత పేరు “బంగ్లా”కు దగ్గరి పోలికలు ఉండడంతో కేంద్రం పేరు మార్పుకు నిరాకరించింది.