పెట్టుబడుల ఉపసంహరణ చేసుకున్నంత మాత్రాన దేశంలో ఆర్థిక మందగమనాన్ని గాడిలో పెట్టడం కుదరని పని అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని దీదీ కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని వాటాను విక్రయించడం ద్వారా తాత్కాలిక ఉపశమనమే లభిస్తుందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంక్షోభ నివారణకు ఏకైక మార్గంగా కనబడొచ్చు. కానీ ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఏమాత్రం దోహదం చేయవు. పైగా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిపోతుంది. అందువల్ల ప్రధాని మోదీ మన దేశంలోని ఆర్థిక రంగ నిపుణులను సంప్రదించాలని కోరుతున్నా. ఈ దేశం మనందరిదీ గనక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని మమతా కోరారు.