దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్ డౌన్ అయిన తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. విమానాలు తిరిగితే షట్ డౌన్ కు అర్థం లేదని, క్వారంటైన్ విధానాలకు కూడా ఇది తూట్లు పొడుస్తుందని అన్నారు. తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను నిలిపివేయాలని కోరుతూ ప్రధాని మోదీకి మమతా లేఖ రాశారు.
లాక్ డౌన్ అయినా కూడా దేశంలో విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. విమానాల్లో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండదని తెలిపారు. పక్కపక్కనే కూర్చుని ప్రజలు ప్రయాణిస్తారని… దీని వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. విమానాలను రద్దు చేసినపుడే పశ్చిమబెంగల్ లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతామని చెప్పారు.