ఎమ్ పాన్ తుఫాను భీభత్సంతో పశ్చిమ బెంగాల్ లో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దీంతో వీధినపడ్డ కోల్ కతా వాసులు నిరసనలకు దిగడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరమంతా విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించి, నిత్యావసరాలను అందరికీ అందుబాటులోకి తీసుకుని రావడానికి మరింత సమయం పడుతుందని తెలిపారు. మౌలిక వసతులు, పంటలకు వాటిల్లిన నష్టం సుమారు లక్ష కోట్ల రూపాయల వరకూ ఉందన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
అధికారులు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారని, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులు చక్కబడతాయని అన్నారు. సహాయక చర్యల కోసం ఆర్మీని కూడా పిలిపించామని తెలిపారు. బారక్ పూర్ – సోడేపూర్ బైపాస్ రోడ్డులో పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. దక్షిణ కోల్ కతాలోని కస్బా, గారియా ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించిన ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. తమకు వెంటనే విద్యుత్ ఇవ్వాలంటూ కోనా ఎక్స్ ప్రెస్ వేపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.