మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మండిపడ్డారు.ఈ రోజు లోక్సభలో ఆయన మాట్లాడుతూ సభలో ఓ ప్రశ్న వేద్దామని అనుకున్నాను, కానీ మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు చూస్తుంటే.. ఎటువంటి ప్రశ్నలు వేయాలని అనిపించడంలేదన్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రాహుల్ వ్యాఖ్యానించారు. మహా పరిణామాల పట్ల రాహుల్తో పాటు సోనియా కూడా నిరసన వ్యక్తం చేశారు.
సభాపతి పోడియంను చుట్టుముట్టి విపక్ష నేతలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రశ్నోత్తరాలు ముందుకు కొనసాగని పరిస్థితి నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అయితే ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్సీపీ,శివసేన సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రెండు లేఖలు కోరిన సుప్రీం ఇవాళ తన తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించనుంది.