మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “మహానటి”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “మహానటి” గత ఏడాది విడుదలై మంచి ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటనకి ప్రేక్షకులు జేజేలు పలికారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, సమంత , విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. “మహానటి” చిత్రం ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించగా తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చైనాలోని షాంగై లో జూన్ 15నుండి 24 వరకు 22వ షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుండగా, ఇందులో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. షాంగైలో ప్రదర్శితమవుతున్న తొలి ఇండియన్ సినిమాగా “మహానటి” అరుదైన ఘనత సాధించింది. స్వప్న సినిమాస్ తమ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.