telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మాఘమాసం .. విశిష్టత తెలుసుకోవాల్సిందే..

maghamasam specialtya

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. ఈ ఏడాది మాఘమాసం 25-01-2020 నుండి 23-02-2020వరకు ఉంటుంది. ఈమాఘ మాసంలో వచ్చే పర్వదినాలు వాటిలో కొన్నిటి విశిష్టత ఒకసారి తెలుసుకుందాం…

మాఘమాస విశిష్టత : మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి. మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్నమకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమ రోజు సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన, జప, తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు
“దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ!
ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!”
“సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ!
త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!” అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్ఘ్యమివ్వాలి.

maghamasam specialtyఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట.

మాఘమాసంలో వచ్చే పర్వదినాలు, తిథులు
1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. 2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి 4. శుద్ధ పంచమి 5. శుద్ధ షష్టి 6. శుద్ధ సప్తమి 7. అష్టమి 8. నవమి 9. ఏకాదశి 10. ద్వాదశి 11. త్రయోదశి 12. మాఘ పూర్ణిమ 13. కృష్ణపాడ్యమి 14. కృష్ణ సప్తమి 15. కృష్ణ ఏకాదశి 16. కృష్ణద్వాదశి 17. కృష్ణ చతుర్దశి, మహా శివరాత్రి 18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి “శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి”అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున “డుంఢిరాజును” ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు. డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు.”కుంద చతుర్థి” నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది.అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.

మాఘపంచమి : “మాఘశుద్ద పంచమి”ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే “సరస్వతీదేవి” జన్మించిందట. ఈనాడు “రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.

రధ సప్తమి : మాఘశుద్ద సప్తమి ఇదే “సూర్య సప్తమి”అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.

భీష్మాష్టమి , భీష్మ ఏకాదశి : “మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!” మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం.

మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. మహా మాఘి ఇది విశేష పర్వదినం. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయానికి ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి. ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం. తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిధే. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది. అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పా౦డున౦దన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు. మాఘ పూర్ణిమ నాడు ” అలభ్య యోగం ” అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.

maghamasam specialtyasమాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పండితులు పేర్కొంటున్నారు. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా “శివరాత్రి”వరకూ అన్ని పర్వదినాలే. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి ఎంతో విశిష్టత ఉంది. మాఘమాసంలో శుభముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి. వాటితో ఈ నెల అంతా పెళ్లిళ్ల సందడి, గృహప్రవేశాలతో హడావుడిగా ఉంటుంది.

Related posts