మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం భారత్ సినిమాలని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ సినిమాలకి సంబంధించిన సీడీ, డీవీడీలని సీజ్ చేస్తున్నట్టు పేర్కొంది. వాటితో పాటు భారతీయ కళాకారులు మరియు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించే ప్రకటనలను ప్రసారం చేయడాన్ని నిషేదించే నిర్ణయాన్ని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) తీసుకుంది. దీనిపై ప్రముఖ ఫిలిం మేకర్ మధుర్ బండార్కర్ స్పందించారు. “సీడీలు, డీవీడీల, ప్రకటనలపై నిషేధం చాలా తప్పు. పాకిస్తాన్ ప్రజలు ఎల్లప్పుడు మా సినిమాలని ఆదరిస్తుంటారు. సృజనాత్మక మరియు కళాత్మక విషయాలని పాక్ నిషేధించడం తప్పుడు నిర్ణయం. కళా స్వేచ్ఛ తప్పక ఉండాలి. పాక్ చేసే పనుల వలన భారతదేశం చూపించే కళాత్మకతని పాకిస్తాన్ ప్రజలు కోల్పోతారు” అని అన్నారు.