జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగానే ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ అదేమిటంటారా ? పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాలో జగన్ ఓ ప్రకటన చేశారు. వైసిపి అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ జిల్లాగా పేరు మారుస్తానని చెప్పారు. దానికి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల అంచనా. అయితే ఇపుడావసరం వచ్చేట్లు లేదు. ఎందుకంటే 13 జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాల రాష్ట్రంగా పునర్వ్యవస్ధీకరించనున్నట్లు చెప్పారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా మార్చబోతున్నారట. 16 నియోజకవర్గాల జిల్లాకు ప్రస్తుతం మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉంది. రేపటి రోజున జిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాలను రెండు జిల్లాలుగా విడదీస్తారు. విజయవాడ పార్లమెంటును ఓ జిల్లాగా చేసి బహుశా కృష్ణా జిల్లాగానే కొనసాగిస్తారు.
మచిలీపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి దానికి ఎన్టీయార్ జిల్లాగా నామకరణం చేస్తారని సమాచారం. దాన్నే ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో జగన్ చేసిన ప్రకటనను సామాజికవర్గాలకు అతీతంగా టిడిపిలోని పెద్ద తలకాయల్లో కొందరు తప్ప మిగిలిన అందరూ స్వాగతించారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోనే ఎన్టీయార్ పుట్టిన ఊరు నిమ్మకూరు కూడా ఓ భాగం. కాబట్టి జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టగానే నిమ్మకూరుకు అలాగే గుడివాడ నియోజకవర్గానికి మహర్దశ పడుతుందని అంచనా వేస్తున్నారు.