‘మా’ ఎన్నికలు ఈసారి చాలా ఉత్కంఠంగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటి హేమకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారంటూ నటి హేమ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
నరేశ్ నిధులు దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సభ్యులతో హేమ మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయపడింది. దీనిపై స్పందించిన నరేశ్.. హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అంతేకాక మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరు కూడా స్పందించారు. స్వయంగా ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు. క్రమశిక్షణ సంఘం కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎన్నికలు మున్ముందు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
రాజకీయాలంటే అసహ్యం… సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ నట దిగ్గజం వ్యాఖ్యలు