తేనెలొలుకు భాషలో
తేట గీతమయ్యాను…
తెనుగు భాష నేనుగా
ఒదిగి పోతున్నాను…!
అక్షరాల పూదోటలో
ఇష్టంగా వికసించిన
కవితా కుసుమంలా…
భాష ఔన్నత్యమే
ఊపిరిగా భావిస్తూ…
తెలుగు భావుటాలను
గర్వంగా ఎగరేస్తాను…!
అక్షరాల మాలలల్లి
నీ మెడలో వేయు వేళ
జారెనేమో ఒక్క సుమం
మూద్దాడగ నీ పాదం…!
ఆ అక్షరం నేనని
పరవశిస్తుంటాను…
వెల్లువై నను తడిపే
భావాల జడిలో
నే మురిసి పోతుంటాను…!
మునివేళ్ళ నుండి జాలువారు
తెలుగు అక్షరాలకు
నేను కైమోడ్పులిస్తాను….!
వేల వేల వందనాలు
మా తెలుగు తల్లి
వెన్నెలవై మురిపించే
మా పాలవెల్లి…!!
(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా)
రచయిత
శ్రీమతి శాంతి కృష్ణ
హైదరాబాద్.