ఈరోజు ఉదయం విశాఖ నగరంలో బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న పర్యాటక కేంద్రం కైలాస గిరిపై ఓ ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం చేసింది. బాదంపాలులో విషం కలుపుకొని తాగడంతో ప్రియుడు అక్కడికక్కడే చనిపోగా కొన ఊపరితో ఉన్న ప్రియురాలిని కేజీహెచ్కి తరలించారు. విశాఖ ఆరిలోవ పోలీసుల కథనం మేరకు…శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సిహెచ్.సత్యనారాయణ, రౌతు కమలలు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏమైందో ఏమో ఈరోజు ఉదయం కైలాసగిరిపైకి చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న బాదంపాలులో పురుగుల మందు కలిపి తాగేశారు. దీంతో కాసేపటికి ఇద్దరూ అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు.
కొండపై సిబ్బంది వీరిని గమనించి ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన చేరుకున్న ఆరిలోవ పోలీసులు జంటను పరిశీలించారు. అప్పటికే సత్యనారాయణ చనిపోగా, కొన ఊపిరితో ఉన్న కమలను అంబులెన్స్లో కేజీహెచ్కి తరలించారు. కమల బ్యాగులో సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలన్నది మా కోరిక. కానీ మాకా అదృష్టం లేదు. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇదే నా చివరి కోరిక’ అంటూ కమల రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆత్మహత్యా యత్నం చేసిన జంట ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది.