లాక్డౌన్లో పని చేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడా అత్యవసరాలకు కొరత రాకుండా చూస్తున్నామని తెలిపారు. వలస కూలీలకు ఆహారం, నిత్యావసరాలు సమకూరుస్తున్నామని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కి చేరిందని తెలిపారు. నిన్న ఒక్కరోజే 941 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వైరస్ నుంచి 1489 మంది కోలుకున్నారని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. మేకిన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించామని పేర్కొన్నారు.