కరోనా వైరస్ తాకిడికి అల్లాడుతున్న బ్రిటన్, జర్మనీ దేశాలకు మరోసారి భారత్ ఆపన్నహస్తం అందించాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా విమానాల్లో పండ్లు, కూరగాయలను ఎగుమతి చేయనుంది. ఇండియాలో లాక్ డౌన్ అమలు కారణంగా, తమ ఉత్పత్తులను సరైన ధరకు విక్రయించుకోలేక పోతున్న భారత రైతులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో విదేశాలకు సీజనల్ పండ్లు, కూరగాయలను రవాణా చేయనున్నాయి.
సోమవారం లండన్ కు, బుధవారం నాడు ఫ్రాంక్ ఫర్ట్ కు ఎయిర్ ఇండియా విమానాలు బయలుదేరుతాయి, కృషి ఉడాన్ స్కీమ్ కింద ఈ విమానాలు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో ఈ విమానాలు అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం అవసరమయ్యే పరికరాలను బ్రిటన్, జర్మనీల నుంచి తీసుకురానున్నాయి.
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విదేశాల్లో మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును మరింత సులువుగా కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కృషి ఉడాన్ స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీములో భాగంగా అటు ఎగుమతిదారులు, ఇటు దిగుమతిదారులకు అవకాశాలు లభిస్తాయి. తద్వారా రైతులకూ మేలు కలిగే అవకాశముంది.