ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. 2019 జనవరి నుంచి జూన్ నెలవరకూ చంద్రబాబు నెలకు రూ.2,000 పెన్షన్ ఇచ్చారని లోకేశ్ గుర్తుచేశారు. అయితే ఈ విషయాన్ని జగన్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రకటనలో అన్ని అబద్ధాలేనని చెప్పుకొచ్చారు. ఇందుకోసం భారీగా ప్రజాదనాన్ని తగలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ.. “అయ్యా జగన్ గారు, అబద్ధాలకు కూడా, ఇంత డబ్బులు తగాలెయ్యాలా ? జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు అంటే ఆరు నెలల పాటు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? అందులో 5 నెలల పాటు చంద్రబాబు సీఎంగా ఉండగా ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా ? ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా ?” అని లోకేశ్ ట్వీట్ చేశారు.