telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గూడ్స్ వాహనాలను ఆపొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

goods vechiles

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గూడ్స్ క్యారియర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గూడ్స్ వాహనాలను కొన్ని రాష్ట్రాలు అనుమతించడం లేదు. అలా చేయడం వల్ల దేశ వ్యాప్తంగా సరుకుల కొరత ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గూడ్స్ వాహనాలను ఆపొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది.

గూడ్స్ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని సూచించింది. లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించాలని కేంద్ర హోం శాఖ కోరింది. ఆయా రాష్ట్రాల్లో అన్ని ట్రక్కులు, గూడ్స్ క్యారియర్లు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. ట్రక్కు తీసుకెళ్తున్న ఆయా వస్తువులు అవసరమా? కాదా? అనేది చూడకుండా పర్మిషన్ ఇవ్వాలన్నారు.

ఆయా రాష్ట్రాల అధికారుల నుంచి ట్రక్ డ్రైవర్లకు ఎలాంటి అదనపు పర్మిట్లు అవసరం లేదని స్పష్టం చేశారు. కార్గోలకు ప్రత్యేకంగా పర్మిట్ లేదా అనుమతి కూడా అవసరం లేదన్నారు.సరుకులు తీసుకెళ్లేందుకు వస్తున్న లేదా డెలివరీ చేసి తిరిగి వస్తున్న ఖాళీ ట్రక్కులు, గూడ్స్ క్యారియర్లను కూడా అనుమతించాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రతి గూడ్స్ వాహనంలో డ్రైవర్ తో పాటు మరొకరికి (క్లీనర్) మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించారు.

Related posts