అద్వానీ నేతృత్వంలో రామ్ రథ యాత్ర పేరిట సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ జరిగిన యాత్ర జరిగి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. నాడు చలాకీగా ఈ యాత్రలో పాల్గొన్న అద్వానీ ఇప్పుడు బీజేపీ కురువృద్ధుడిగా మారిపోయి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నాటి తన కల నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నం అవుతున్న నేపథ్యంలో అద్వానీ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఇది ఓ చారిత్రక సమయమని వ్యాఖ్యానించారు.
భారతావనిలోని ప్రతి హిందువు కలా నెరవేరనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకన్నా తన నోటి వెంట మాటలు రావడం లేదని అన్నారు. ప్రస్తుతం 92 సంవత్సరాల వయసులో ఆయన ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనకు అక్కడికి వెళ్లాలని కోరికగా ఉన్నా, వెళ్లలేకున్నానని అన్నారు. రామజన్మభూమిలో మందిర నిర్మాణం బీజేపీ కలని చెప్పారు. రథయాత్ర ద్వారా ఈ ఉద్యమంలో పాల్గొనడంతో తన కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించానని అన్నారు.