మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళనలతో సతమతం అవుతున్నారా ? నిత్యం బాగా ఒత్తిడికి గురవుతున్నారా ? అయితే ఈ చిన్న చిట్కాతో దానిని సులభంగా అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు. ఒత్తిడి ఎదుర్కోడానికి, నిత్యం 20 నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో అలా అలా తిరిగితే సరిపోతుందంటున్నారు వారు. అంతే.. మీ ఒత్తిడి మటుమాయం అవుతుంది. అవును, ఇది నిజమే. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నిత్యం 20 నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో గడిపితే ఒత్తిడి అంతా పోతుందట.
నిత్యం పార్కులకు వెళ్లే 100 మందిపై యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన సైంటిస్టులు అధ్యయనం చేశారు. వారికి ఉన్న మానసిక సమస్యలు, సంతృప్తికరమైన జీవితం వంటి అంశాలపై వారికి సైంటిస్టులు ప్రశ్నలు వేసి రాబట్టారు. దీనితో తెలిసిందేమిటంటే.. నిత్యం 20 నిమిషాల పాటు పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో గడిపే వారికి ఒత్తిడి అసలు ఉండదట. దీనికి తోడు డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు కూడా పోతాయని వారు చెబుతున్నారు.
అయితే సిటీల్లో అలాంటి వాతావరణం ఉండదు కదా అనే వారు.. తమకు సమీపంలో ఉన్న పార్కులకు వెళ్లి కొంత సేపు గడిపితే చాలు.. మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. మరింకెందుకాలస్యం.. మీరు కూడా ఒత్తిడి బారిన పడితే అలా ఓ 20 నిమిషాలు ఏదైనా పార్కులో తిరిగి రండి. ఒత్తిడి మటుమాయం అవుతుంది..!