ఆగ్రా పురావస్తు శాఖ అధికారులు ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ వద్ద సందర్శకులు మూడుగంటలకు పైగా ఉంటే వారికి జరిమానా విధించాలని తాజాగా నిర్ణయించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ సందర్శకులను నియంత్రించడానికి వీలుగా 14 గేట్లను ఏర్పాటు చేశారు. ఆగ్రా నగరంలోని తాజ్మహల్ సందర్శకులు లోపలకు వచ్చిన తర్వాత కేవలం మూడు గంటలపాటు మాత్రమే అనుమతిస్తారు.
తాజ్ వద్ద అధిక సమయం ఉంటే వారికి ఎగ్జిట్ గేటు వద్ద జరిమానా విధించాలని నిర్ణయించినట్లు ఆగ్రా పురావస్తు శాఖ సూపరింటెండెంట్ వసంత్ స్వరాంకర్ చెప్పారు. మొఘల్ రాజైన షాజహాన్, తన భార్య ముంతాజ్ గుర్తుగా నిర్మించిన ఈ చారిత్రక సమాధిని చూడటానికి రోజూ వేల మంది వస్తూ ఉంటారు. తాజ్మహల్ పరిరక్షణను పరిగణనలోకి తీసుకొని పురావస్తు శాఖ అధికారులు సందర్శకులను నియంత్రించేందుకు మూడు గంటల సమయం నిబంధనను తీసుకువచ్చారు.