ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తోందనే వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ నేతలు యనమల స్పందించారు. శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని యనమల వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేయాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉందని అన్నారు. కేవలం పార్లమెంటు నిర్ణయంతోనే శాసనమండలి రద్దు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అన్నారు.
ఏపీ శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో వైసీపీ ప్రభుత్వం పెడుతున్న బిల్లులన్నీ ఆమోదం పొందుతున్నాయి. మరోవైపు, శాసనమండలిలో విపక్ష తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. వీరితో పాటు బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. దీంతో, మండలిలో బిల్లులు పాస్ కావడం లేదు. ఈ నేపథ్యంలో శాసనమండలిని ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.