సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పరమపదించారు. న్యుమోనియాతో వారం రోజులక్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన ఊపిరితిత్తుల కాన్సర్ తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పరిస్థితి విషమించడంతో వైద్యచికిత్సకు ఆరోగ్యం సహకరించలేదు.
తెలుగుసినిమా రంగానికి ఆయన విలువైన సాహిత్యాన్ని అందించి రాష్ట్రప్రభుత్వ, కేంద్రప్రభుత్వం అందించే విశిష్ట పురస్కరాలను అందుకున్నారు. సిరివెన్నెల సినిమాకు అద్భుతమైన సాహిత్యంతో పాటలను అందించిన సీతారామశాస్త్రికి ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మారిపోయింది.
స్వతహాగా శివభక్తుడైన సీతారామశాస్త్రి శివుని పట్ల భక్తివిశ్వాసాలతో 500కు పైగా గేయాలతో శివున్ని కీర్తించారు. ఆయన సాహిత్యంలో కుటుంబ విలువలు, మానవీయ విలువలు కన్పిస్తాయి. పాటల్లో భావుకత, ఆత్మీయతానుబంధాలు, కుటుంబ సభ్యుల్లో భావోద్వేగాలను స్పృశిస్తాయి. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాధ చాయలు అలముకున్నాయి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అనకాపల్లిలో తేదీ 20 మే, 1955.. శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. సిరివెన్నల విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసాడు.ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు..చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ సినిమా టైటిల్నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. సిరివెన్నెల సినిమాతోను అవార్డులు సొంతం చేసుకున్నారు సీతారామశాస్త్రి..దర్శకుడు కె.విశ్వనాధ్ తో అన్ని సినిమాలకు సిరివెన్నెల పనిచేసారు. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాడు.
దాదాపు 800లకు చిత్రాల్లో 3వేలకు పైగా పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
సీతారామశాస్త్రి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో, అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలి పాట ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రి ది. అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు, సత్కారాలకు లెక్కేలేదు. ‘కంచె’ చిత్రానికి గానూ ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంత చేసుకున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు..రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ కె.విశ్వనాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు ఆయన పాటలంటే అంత ఇష్టం.
ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశాడు..ఆర్ ఆర్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి..ఆ పాట తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేసిన సిరివెన్నెల ఇక లేరని అనుకోవడం మనసు కష్టంగానే ఉందని చెప్పాలి. నవ్య మీడియా తరుపున సిరివెన్నెల గారి ఆత్మకు శాంతి చేకూరని కోరుకుంటున్నాము.