telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కళాభినేత్రి, నవలా నాయిక వాణిశ్రీ పుట్టినరోజు…

Vanisri

తెలుగు చలనచిత్రసీమలో మహానటి సావిత్రిది ఒక అద్భుత శకం. ఆమె తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా  అంటూ చర్చలు జరుగుతున్న రోజుల్లో ఒక వెలుగు రేఖలా కళాభినేత్రి వాణిశ్రీ దూసుకొని వచ్చింది. గొప్ప నవలా నాయికగా పేరు తెచ్చుకుంది. సావిత్రి ప్రభావం తనమీద పడకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరుచుకుంది. పదేళ్లు సినీరంగాన్ని రాణిలా ఏలింది. ఏ సినిమా విడుదలైనా అందులో వాణిశ్రీనే! ఒక పల్లెటూరి పొగరుబోతు పాత్ర ధరించాలన్నా, గొప్ప పౌరుషమున్న మధ్యతరగతి యువతి పాత్ర పోషించాలన్నా, రూపలాణ్యాలున్న నవలా నాయికగా నటించాలన్నా, ఆ రోజుల్లో ఒక్క వాణిశ్రీకే ఆ అదృష్టం దక్కింది. ఆమె కథానాయిక మొల్ల పాత్రలో పద్మాసనం మీద కూర్చున్న తీరును చూసి నటరత్న ఎన్టీఆర్‌ ఎంతగా పొగిడారో చెప్పలేం. నటనా రంగానికి స్వస్తిచెప్పి సంసార జీవితంలో ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ కళాభినేత్రికి ఆగస్టు 3, పుట్టిన రోజు. ఆ సందర్భంగా వాణిశ్రీ జ్ఞాపకాలు కొన్ని…

Vanisri

రత్నకుమారిగా…
కళాభినేత్రి వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. పుట్టింది (ఆగస్టు 3, 1948) నెల్లూరులో. తల్లితండ్రులు వెంకమ్మ, రాఘవయ్యలకు ఇద్దరే కూతుళ్లు. తండ్రి చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించడంతో తల్లి వెంకమ్మ ఇద్దరు పిల్లలతో మద్రాసు చేరుకుంది. చదువు నిమిత్తం అక్క కాంతమ్మతో బాటు రత్నకుమారి నెల్లూరులోనే తొమ్మిదవ తరగతి వరకూ చదువుకుంది. తరువాత మద్రాసులోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా సభ వారి పాఠశాలలో చేరి మెట్రిక్యులేషన్‌తోబాటు సంగీతం, భరతనాట్యం కూడా నేర్చుకుంది. డా।। గరికపాటి రాజారావు ఇంటికి దగ్గరలోనే రత్నకుమారి ఉండడంతో అక్కడ జరిగే నాటకాల రిహార్సల్స్‌ గమనిస్తూ ఉండేది. అదే నటన మీద రత్నకుమారి అభిరుచి పెంచుకునేందుకు దోహదపడింది. కానీ తన దృష్టంతా సినిమా నటన మీదే! ఆ రోజుల్లో వెంపటి చినసత్యం పిల్లలకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తుండేవారు. వాణిశ్రీ కూడా సత్యం వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకుంది. ఆయన రూపొందించిన ‘ఆరాధన’ అనే నృత్యరూపకంలో నాయికగా నటించింది. ఆ రోజుల్లోనే చుండి నాగభూషణం రవి ఆర్ట్‌ థియేటర్స్‌ స్థాపించి ‘రక్తకన్నీరు’ నాటకం వేస్తుండేవారు. ఆ సమాజంలో చేరి రక్తకన్నీరు నాటక ప్రదర్శనల్లో పాల్గొంది. ఆ నాటక అనుభవంతోనే మద్రాసులోని అమెచ్యూర్‌ నాటక సమాజం వారు ప్రదర్శించే రాగరాగిణి, దొంగ, చిల్లరకొట్టు చిట్టెమ్మ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు ధరించింది. చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటక ప్రదర్శన సందర్భంగా ప్రఖ్యాత కన్నడచిత్ర దర్శకుడు హున్సూరు కృష్ణమూర్తి దృష్టిలో పడడంతో రత్నకుమారికి ‘వీరసంకల్పం’ అనే సినిమాలో నాయిక పాత్ర పోషించే అవకాశం దొరికింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. గోల్డెన్‌ స్టూడియోలో ఈ చిత్రం షూటింగు జరిగింది. సినిమా రషెస్‌ చూడడం తటస్థించిన జానపద బ్రహ్మ విఠలాచార్య ‘నవగ్రహ పూజా మహిమ’ సినిమాలో ఆమె చేత చిన్న వేషం వేయించారు. కన్నడంలో రత్నకుమారికి ‘మిస్‌ లీలావతి’, ‘మరియదమ’ వంటి మంచి సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం చిక్కింది. అలా రత్నకుమారి సినీరంగ ప్రవేశం కన్నడ సినిమాలతోనే మొదలైంది.

Vanisri

వాణిశ్రీ అవతారమెత్తిన రత్న
‘కనకదుర్గ పూజా మహిమ’ సినిమాలో విఠలాచార్య రత్నమాలకు చిన్న వేషం ఇచ్చినా అది మంచి ప్రాధాన్యత కలిగి ఉండడంతో ప్రేక్షకులకు రత్న అంటే ఎవరో తెలిసింది. ఆ మధ్యలో ఒక గమ్మత్తు జరిగింది. మహానటుడు యస్‌.వి.రంగారావు తమిళంలో బాగా ఆడిన ‘నాన్‌ ఒరు పెణ్ణ్‌’ సినిమాని ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్‌తో భాగస్వామ్యం కలిపి ‘నాదీ ఆడజన్మే’ అనే సినిమాను వాణిశ్రీ ఫిలిమ్స్‌ అనే సొంత బ్యానర్‌ మీద తెలుగులో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అందులో నాయిక పాత్రకు రత్నకుమారిని ఎంపిక చేశారు. తన సొంత బ్యానర్‌ పేరు కలిసి వచ్చేలా రత్నకుమారి పేరును వాణిశ్రీగా మర్చారు. అయితే మెయ్యప్ప చెట్టి అభ్యంతరం తెలుపగా, ఆ పాత్ర జమునను వరించింది. అయితేనేం రత్నకుమారి కాస్తా వాణిశ్రీగా రూపాంతరం చెందింది. అదే మెయ్యప్ప చెట్టియార్‌ తదనంతరం కాలంలో వాణిశ్రీతో ఏడు సినిమాల దాకా నిర్మించారు. ఆ రోజుల్లో హిందీ చిత్రరంగాన్ని ఏలుతున్న వైజయంతిమాలను, వాణిశ్రీ ఆదర్శంగా తీసుకుంది. సంభాషణలు ఎలా పలకాలి వంటి విషయాలను యస్‌.వి.రంగారావు నేర్పారు. 1967లో వచ్చిన డూండీ సినిమా ‘మరపురాని కథ’ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పుడే ‘సుఖదుఃఖాలు’ సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించడంతో ప్రేక్షకులకు వాణిశ్రీ నటన మీద మక్కువ పెరిగింది. అసలు వాణిశ్రీ ‘మరపురానికథ’ సినిమా చేయడానికి దర్శకుడు వి.మధుసూదనరావు కూడా మొదట జంకారు. వాణిశ్రీ నటనా పటిమను గుర్తించిన ఆయన తరువాత వాణిశ్రీ కథానాయికగా ‘కృష్ణవేణి’, ‘మంచివాడు’, ‘పవిత్రబంధం’, ‘ఎదురీత’ వంటి సినిమాలు నిర్మించారు. జానపద సినిమాలకు కాలం చెల్లి సాంఘిక చిత్రాలు పుంఖానుపుంఖాలుగా రావడం వాణిశ్రీకి కలిసొచ్చింది. వాణిశ్రీ వద్ద ఒక మంచి సుగుణం ఉంది. ఎటువంటి గొప్పలకు పోకుండా ప్రతి చిన్న టెక్నీషియన్‌ ఇచ్చే సలహాను కూడా గౌరవిస్తూ, అందులో మంచి ఉందనిపిస్తే ఆచరణలోకి పెట్టడమే ఆ సుగుణం.

Vanisri

పెద్ద హీరోల సరసన…
1969లో అన్నపూర్ణా వారు నిర్మించిన ‘ఆత్మీయులు’ సినిమాలో వాణిశ్రీ తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నాయికగా నటించింది. మొదట విజయనిర్మల పోషించిన పాత్రను దుక్కిపాటి మధుసూదనరావు వాణిశ్రీకి ఇవ్వజూపగా, ఆమె హీరోయిన్‌ పాత్ర కోసం పట్టుబట్టి సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘భలేరంగడు’ సినిమా కూడా విజయం సాధించడంతో వాణిశ్రీ వెనక్కు చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. నందమూరి అందగాడితో ‘నిండుహృదయాలు’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రానికి విశ్వనాథ్‌ దర్శకత్వం నిర్వహించారు. హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన ‘కథానాయికమొల్ల’ సినిమాలో మొల్ల పాత్రలో రాణించిన వాణిశ్రీకి మంచిపేరు రావడమే కాకుండా ఆ చిత్రానికి నంది బహుమతి లభించింది. ఆ రోజుల్లో వాణిశ్రీ తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చివేసి, చీరకట్టు, శిరోజాలంకరణలో అనూహ్యమైన ప్రయోగాలు చేసి విజయం సాధించింది. అలా డెబ్భైయవ శకాన్ని వాణిశ్రీ ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. అక్కినేని, నందమూరి, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్‌, కాంతారావు, రంగనాథ్‌, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి నటులతో హీరోయిన్‌గా నటించింది. ఆ శకంలో వచ్చిన ‘దసరాబుల్లోడు’, ‘కొడుకు కోడళు’్ల, ‘ప్రేమనగర్‌’, ‘బంగారుబాబు’, ‘దేశోద్ధారకులు, ‘ఎదురులేని మనిషి’, ‘కన్నవారి కలలు’, ‘గంగ-మంగ’, ‘చక్రవాకం’, ‘జీవనజ్యోతి’, ‘ఇల్లు ఇల్లాలు’, ‘రైతుబిడ్డ’, ‘చీకటి వెలుగులు’, ‘చక్రధారి’, ‘భక్తకన్నప్ప’, ‘జీవనతరంగాలు’ వంటి మరెన్నో సినిమాలు బాక్సాఫీసు విజయాలు సాధించాయి. తమిళంలో శివాజీ గణేశన్‌ వంటి అగ్రశ్రేణి నటులతో దాదాపు ఎనభై సినిమాల్లో వాణిశ్రీ నటించింది. అలాగే కన్నడ రాజకుమార్‌ వంటి నాయకుల సరసన దాదాపు ముఫ్పై కన్నడ సినిమాల్లో నటించింది. అయితే మలయాళంలో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ఆమె కథానాయికగా నటించిన చివరి సినిమా ‘దేవుడు మావయ్య’.

Vanisri

పెళ్లి నిర్ణయం…
ఒకసారి ఊటిలో ఎన్టీఆర్‌ నటించిన ‘ఎదురులేని మనిషి’ సినిమా కోసం ‘కసిగా వుంది, కసి కసిగా వుంది, కలవక కలవక కలిసినందుకే కస్సుమంటుంది’ అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. అందులో ఎన్టీఆర్‌ రెచ్చిపోయి నటించేలా డ్యాన్స్‌ మాస్టర్‌ పాటను కంపోజ్‌ చేశారు. అటువంటి పాటల్లో నటిస్తే తన మీద అభిమానులకున్న గౌరవం పోతుందని వాణిశ్రీ భావించింది. అలాంటిదే ‘సాహసవంతుడు’ సినిమాలోని ‘ఆడలేక మద్దెల’ పాట కూడా. తనకున్న మంచి పేరును కాపాడుకుంటూ చిత్రరంగం నుంచి విరమిస్తే మంచిదనే నిర్ణయాన్ని ఊటిలోనే వాణిశ్రీ తీసుకుంది. చెంగల్పట్టుకు చెందిన యువ డాక్టర్‌ కరుణాకరన్‌ను పెళ్లాడాలని వాణిశ్రీ నిర్ణయించుకుంది. ఈ వివాహానికి సంధానకర్త వాణిశ్రీ కుటుంబ వైద్యులు అణ్ణామలై. అది పెద్దలు కుదిర్చిన సంబంధమే. అలా 1979 ఫిబ్రవరిలో వాణిశ్రీ డాక్టర్‌ కరుణాకరన్‌ను పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు అనుపమ, కొడుకు కార్తిక్‌. పిల్లలు పుట్టాక వాణిశ్రీ రెండవ ఇన్నింగ్స్‌ మొదలైంది. అది కూడా చిరంజీవి సినిమా ‘అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు’ చిత్రంతో ప్రారంభం. అలా ‘బొబ్బిలిరాజా’, ‘సీతారత్నంగారి అబ్బాయి’, ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ వంటి దాదాపు అరవైకి పైగా సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాలలో నటించినా వాణిశ్రీకి నచ్చినవి రెండే రెండు. అవి ‘కృష్ణవేణ’¨, ‘ఇద్దరు అమ్మాయిలు’. ‘కృష్ణవేణి’ సినిమా పూర్తయ్యాక మూడునెలలదాకా వాణిశ్రీ ఆ పాత్ర ప్రభావం నుంచి బయటకు రాలేకపోయింది. అలాగే ‘ఇద్దరు అమ్మాయిలు’లో ద్విపాత్రాభినయం చేసి ఆ రెండు పాత్రలకు వున్న వైవిధ్యాన్ని అద్భుతంగా అభినయించి చూపించింది. పెద్ద డైలాగులున్న సన్నివేశాలను ఓకే షాట్‌లో ఒకే చేసే ప్రతిభగల నటి వాణిశ్రీ.

Vanisri

మరిన్ని విశేషాలు:
★ వాణిశ్రీ తమిళ డైలాగులు పలికే తీరు గమనించిన శివాజీగణేశన్‌ ఆమెను తమిళ అమ్మాయనే భావించేవారు. కొన్నిసార్లు సందేహ నివృత్తి కోసం ఆమెను అడిగేవారు కూడా. కానీ వాణిశ్రీ మాత్రం చిరునవ్వుతో ఆ ప్రశ్నకు జవాబును దాటవేసేది.

★ తెలుగులో అఖండ విజయాన్ని సాధించిన ‘ప్రేమనగర్‌’ సినిమాను హిందీలో నిర్మించతలపెట్టినప్పుడు అందులో హీరోగా దిలీప్‌కుమార్‌ను, అతనికి జంటగా వాణిశ్రీని నటింపజేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ దిలీప్‌ కుమార్‌ వహిదా రెహమాన్‌ను కోరుకున్నారు. సమీకరణాలు మారడంతో ఆ పాత్ర రాజేష్‌ఖన్నాను వరించగా, వాణిశ్రీ పాత్ర హేమామాలినికి దక్కింది.

★ వాణిశ్రీ అక్క, బావ వాణిశ్రీ జీవితాన్ని వెండితెర వరకే పరిమితం చేసి, సంఘజీవనానికి దూరంగా ఉంచారు. తీవ్రమైన నమ్మక ద్రోహం చేశారు. ఆమె ఆస్తిపాస్తులన్నీ హస్తగతం చేసుకొని వాణిశ్రీకి ఇబ్బందులు కలిగించారు. చివరకు పన్నెండేళ్లు పోరాడి కోర్టు ద్వారా తన ఆస్తులను వాణిశ్రీ తిరిగి పొందగలిగింది.

★ వాణిశ్రీ మేకప్‌ లేకుండా బయటకు వచ్చేది కాదు. షూటింగ్‌ షెడ్యూలు ఏడుగంటలకే అయినా తను మాత్రం ఉదయం తొమ్మిది గంటలకు మాత్రమే షూటింగ్‌ హాజరయ్యేది. అందుకు కారణం వాణిశ్రీ నల్లగా ఉండడమే. రోజూ ఉదయాన్నే మూడుగంటలపాటు మేకప్‌ చేసుకునేది. శరీరం మొత్తానికి మేకప్‌ చేసుకోవాల్సి రావడంతో ఆమె తొమ్మిది గంటలదాకా షూటింగుకు హాజరు కాగలిగేది కాదు. చిత్రరంగంలో ఈ విషయం అందరికీ తెలుసు కనకే అగ్రశ్రేణి నటులు కూడా అభ్యంతరం పెట్టేవారు కాదు.

★ జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాణిశ్రీకి రాజకీయ పదవి కట్టబెడతానంటే సున్నితంగా తిరస్కరించింది. అయితే సినిమాల్లో మంత్రి పాత్రలో మాత్రం అదరగొట్టేది.

★ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల ‘ఆరాధన’ అంటే వాణిశ్రీకి మక్కువ. ఆ నవలను చలనచిత్రంగా మలిస్తే బాగుంటుంది అనుకునేది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

★ వాణిశ్రీకి బాపు-రమణ అంటే ఎంతో గౌరవం. ఆ గౌరవంతోనే ‘గోరంత దీపం’ సినిమాలో మేకప్‌ లేకుండానే నటించింది. ఆ సినిమా వెండితెర నవల వాణిశ్రీ సంతకంతో విడుదలైంది. విచిత్ర జీవితం సినిమా షూటింగుకు ఊటివెళ్తూ ఆ వెండితెర నవల కాపీలను వెంట తీసుకెళ్లి, విశ్రాంతి సమయాల్లో వెయ్యి కాపీలకు పైగా స్వయంగా సంతకాలు పెట్టింది. మేకప్‌ లేకుండా వాణిశ్రీ నటించిన మరొక చిత్రం శ్యాం బెనగల్‌ నిర్మించిన ‘అనుగ్రహం’.

★ తెలుగు సినిమాల్లో నవలా నాయిక అనగానే గుర్తుకొచ్చేది వాణిశ్రీనే! నవలల్లో వర్ణించే రూపలావణ్యాలు వాణిశ్రీకి సొంతం. ‘జీవనతరంగాలు’, ‘ప్రేమనగర్‌’, ‘చక్రవాకం’, ‘సెక్రటరీ’, ‘విచిత్రబంధం’ సినిమాలు అన్నీ గతంలో నవలలుగా వచ్చినవే.

-ఆచారం షణ్ముఖాచారి

Related posts