లెబనాన్ దేశ ప్రధానమంత్రి సాద్ హరిరి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు తలొగ్గి రాజీనామా చేశారు. లెబనాన్ దేశంలో నెలకొన్న అవినీతి, ఆర్థికసంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోవడంపై ఆ దేశ ప్రజలు నిరసన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి ఈ నెల 17వతేదీన వాట్సాప్ కాల్స్ పై కూడా పన్ను విధించాలని నిర్ణయించారు. దీంతో ప్రధాని సాద్ హరిరిపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. ప్రజల నిరసన ఉద్యమాలతో లెబనాన్ దేశంలో గత 12 రోజులుగా బ్యాంకులు, విద్యాసంస్థలు మూతబడ్డాయి. ప్రధాన రహదారులను మూసివేశారు.
సర్కారు ఆందోళనకారులను అణచివేసేందుకు మిలటరీని రంగంలోకి దించినా ప్రజాగ్రహం ముందు వారు నిలవలేక పోయారు. ప్రజాందోళనకు దిగి వచ్చిన లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లెబనాన్ దేశాన్ని ఆర్థికాభివృద్ధి చేసి పరిరక్షించేందుకు నా సహచరులు బాధ్యత తీసుకోవాలి…నేను రాజకీయంగా చివరి దశకు చేరుకున్నాను. అందుకే నేను మీ నుంచి ఏదీ దాచదలుచుకోలేదని రాజీనామా అనంతరం సాద్ హరిరి వ్యాఖ్యానించారు.