ఎన్నికల ప్రచారానికి నేటితో ఆఖరి రోజు కావటంతో ఈ ఒక్క రోజును వివిధ పార్టీల నేతలు తమ తమ ప్రచారాల కోసం రంగం సిద్ధం చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పొన్నూరు, మంగళగిరి, తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కర్నూలులో నిర్వహించే రోడ్డు షోతో జగన్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. డోన్, ఆళ్లగడ్డలలో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయవాడ వెస్ట్, మైలవరంలలో జగన్ సోదరి షర్మిల ప్రచారంలో పాల్గొంటారు. జగ్గయ్యపేట సభతో షర్మిల ప్రచారం ముగియనుంది.
జనసేనాని పవన్ కల్యాణ్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాలకొల్లు, భీమవరం, నరసాపురంలలో నిర్వహించే బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11:45 గంటలకు గురజాలలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలు సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 3:15 గంటలకు తాటికొండ బహిరంగ సభలో టీడీపీ అధినేత పాల్గొని ప్రసంగిస్తారు.