telugu navyamedia
సినిమా వార్తలు

షాకిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” అడ్వాన్సు బుకింగ్స్… జై బాలయ్య అంటున్న వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ విధించి, “యూ” సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఈనెల 29న విడుదల కానుంది.

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, 10 నిమిషాల వ్యవధిలో ఓ మల్టీ ప్లెక్స్ లో 1000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ద్వారా తెలిపారు. “ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య” అంటూ ట్వీట్ చేశారు వర్మ. అంతేకాదు హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో హౌస్ ఫుల్ అయినట్టు థియేటర్ సీటింగ్ స్క్రీన్ షాట్ ను కూడా పోస్ట్ చేశారు.

Related posts