telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కర్నూల్ : .. ప్రాచీన గణపతి మూర్తులు.. విశిష్టత..

kurnool ancient ganesh statues

ఏ పని ప్రారంభించాలన్నా దానికి అడ్డంకులు రాకుండా ప్రదమపూజ అందుకునే గణేశుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశిష్ట గణపతి మూర్తుల గురించి తెలుసుకుందామా.. తొలి మానవుడి ఆనవాళ్లున్న నల్లమలలో అక్కడక్కడా కనిపిస్తు తన ప్రాచీనత్వాన్ని, ఆదిదేవుడన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు గణేశుడు. ఎవరు ఎందుకు అక్కడ ఉంచారో చరిత్ర కందని ఈ వినాయక విగ్రహాలు వివిధ ఆకృతులతో కనిపిస్తు భక్తజనానికి పారవశ్యాన్ని కలిగిస్తున్నాయి. ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెర్వు సమీపంలో నల్లమల అడవుల్లో ఉన్న వరదరాజస్వామి ప్రాజెక్ట్‌ సమీపంలో ఒక చెట్టు కింద ఈ వినాయక విగ్రహం ఉంది. ఇసుక రాతిని వినాయకుడిగా ఎవరో ప్రాచీన శిల్పకారుడు ఈ విగ్రహాన్ని చెక్కినట్లు అర్థమవుతుంది. విగ్రహంపై ఎలాంటి ఆభరణాలు చెక్కి ఉండక పోవడం గమనిస్తే ఇది లోహ యుగానికి ముందుదా అన్న అనుమానమూ కలుగక మానదు. తలపై ఉన్న కిరీటం కూడా ఆకు దొన్నెనో, కర్రతో చేసిందా అన్నట్లుగా ఉంటుందే కాని లోహ కిరీటంగా కనిపించదు.

నాగలూటి వీరభధ్రాలయం సమీపంలో శ్రీశైలం మెట్ల మార్గం వద్ద ఎనిమిది చేతులతో నల్లటి గ్రానైట్‌ శిలతో ఈ అష్టభుజ వినాయకుడి విగ్రహం ఆకట్టుకుంది. అష్ట కరములతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్నాడు. ఎడమ వైపున కుమార స్వామి విగ్రహం కూడా ఉంటుంది. నాగలూటి వీరబధ్రాలయం విజయనగర పాలకులు నిర్మించారని స్థల చరిత్ర చెబుతుంది. దీంతో 14వ శతాబ్దానికి చెందినది తెలుస్తుంది. సిద్ధాపురంలో ఒక వేప చెట్టు కింద ఈ విగ్రహం కనిపిస్తోంది. సమీపంలోని ముర్తుజావలి దర్గా సమీపంలో వెయ్యేళ్లకు పూర్వం మహా పట్టణం ఉండేది. ఇక్కడ పలు ఆలయాల శిథిలాలు ఉన్నాయి. కోట గోడల రాళ్లను సిద్ధాపురం చెరువు రివిట్‌ మెంట్‌కు వాడారు. ఆ సందర్భంలో శిథిల పట్టణం నుంచి వినాయక విగ్రహం సిద్ధాపురం గ్రామానికి చేరింది.

మరో ప్రాచీన వినాయక విగ్రహం ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని నాగలూటి రేంజ్‌లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుప్త మల్లికార్జున (గుమ్మితం) ఆలయ ఆవరణలో ఉంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారని స్థల పురాణం తెలుపుతోంది. ఇసుక రాతితో చెక్కిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది.

Related posts