కర్నాటక రాజకీయాలు గంట గంటకు ఓ కొత్త మలుపు తిరుగుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండగా, మరో 8 మంది అదే దారిలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకూ 12 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, అనారోగ్యంతో ఉన్నానని, సభకు రాలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంతపాటిల్ చెప్పారు. దీంతో 16మంది బలనిరూపణకు దూరంగా ఉన్నట్టు కాగా, ఇప్పుడు మరో 8 మంది రాజీనామా యోచనలో ఉన్నట్టు వార్తలు రావడం సీఎం కుమారస్వామికి కొత్త తలనొప్పిని తెచ్చిపెచ్చినట్టవుతుంది.
ప్రస్తుతం రాజీనామా చేసిన 15 మందిలో అత్యధికంగా మైసూరు, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారే. ఆ ప్రాంతంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఇక్కడ ఉప ఎన్నికలు జరిగితే విజయం సులువు కాదని భావించిన ఆ పార్టీ, తమకు బలమున్న ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన 8 మందితో రాజీనామాలు చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బలనిరూపణ ఇంకాస్త ఆలస్యమైతే వీరంతా రాజీనామా చేయడం ఖాయమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.