హైదరాబాద్ వనస్థలిపురంలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తన స్నేహితులు ఇద్దరిని ఆధార్ కార్డ్ చూపిన మార్కెట్ లోపలికి రానీయకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, జాత్యహంకారాన్ని ఏ రూపంలో ప్రదర్శించినా సరే కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా భావించాలని, ఈ మేరకు రిటైల్ అసోసియేషన్ కు ఆదేశాలు పంపేలా పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలను ఆదేశించాలని తెలంగాణ డీజీపీకి సూచించారు.
కరోనా మహమ్మారి మనల్ని భయపెడుతున్న సమయంలో కూడా మన సమాజంలో జాత్యహంకారానికి చోటు ఉండటం బాధాకరమని అన్నారు. రెండు మహమ్మారులు ఒకటి ‘కోవిడ్-19’మరొటి ‘రేసిజం’ తో మనం పోరాడాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తెలిపారు.